Friday, September 26, 2008

ఇంకో పెళ్ళాం కాడికి పోయినాడు సార్......!

నేనప్పుడు జర్నలిస్టుని.

తిరుపతిలో ఆంధ్రజ్యోతి పత్రిక స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేస్తున్నాను. మన నారా చంద్రబాబు నాయుడుగారు ముఖ్యమంత్రి.
చిత్తూరు జిల్లా లోని ఒక మారుమూల ప్రాంతంలో 'జన్మభూమి ' సభ ఏర్పాటు చేశారు. తంబళ్ళపల్లె నియోజకవర్గం లో అనుకుంటా . కవరేజి కోసం నేను కూడా ఆ ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. ఏర్పాట్లు భారీగానే జరిగాయి.

కార్యక్రమంలో భాగంగా బడి మానేసిన పిల్లల్ని కూడా వేదిక సమీపంలో కూర్చోపెట్టారు.
బాబుగారు వచ్చారు. కార్యక్రమం ప్రారంభమైంది.

పన్నెండేళ్ళ చిన్నోడొకడ్ని వేదిక మీదకు పిలిచారు.

'నీ పేరేంటి ?' అడిగారు.
' మాధవయ్య ' చెప్పాడా చిన్నోడు.
' వెరీగుడ్. స్కూలుకు వెళ్తున్నావా ' మరోప్రశ్న.

' లేదు సా ' సమాధానం.
' ఏం? ఎందుకెళ్ళడం లేదు? ' బాబుగారికి కొద్దిగా కోపమొచ్చింది ఈసారి.
' పనికి పోతాండాను సా..'
' ఏం పనికి?' అధికారులను కాస్త కోపంగా చూస్తున్నారు సి.ఎం గారు.
' ఆవుల్తోలుకోని పోతాన్సా...కొండమిందికి. వచ్చినంక పాలు పిండి సెంటరులో పోస్తాను సా..' జనాలను, మొహం మీదకు వస్తున్న మీడియా కెమెరాలను చూస్తూ బెరుగ్గా సమాధానమిచ్చాడు .

' మీ అమ్మా నాన్న ఏం చేస్తారు? '
' మా నాయన ఏమీ చేయడు సా...మాయమ్మ వంట చేస్తుంది సా'

' నువ్వు పని మానేసి స్కూలుకు వెళ్ళాలి...సరేనా! ఏమయ్యా ఈ కుర్రాడిని స్కూలుకు పంపండి. వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడండి ' ఎం.ఇ.వో కు ఆదేశాలు జారీ చేశారు.
'ఇప్పటికి చాలాసార్లు మాట్లాడాం సార్ ..పని మానేసి బడికెళ్తే తిండెలా? అంటున్నాడు సార్ వీళ్ళ నాన్న' చెప్పాడు ఎం.ఇ.వో

' ఏం బాబూ నీకు చదువుకోవడం ఇష్టమేనా?' మరోసారి కుర్రాడ్ని రెట్టించారు బాబుగారు.
' ఇష్టమే సా..కానీ మా నాయిన తిడ్తాడు సా...'
' నేను మట్లాడ్తాను మీ నాన్నతో..ఏం పేరు మీ నాన్న పేరు ' దర్పంగా ప్రశ్నించారు.
' మహదేవయ్య సా '
' మహదేవయ్య ఒకసారి వేదిక మీదకు రావాలి..' పిలుస్తున్నారు నాయుడుగారు.

నాలుగైదు సార్లు పిలిచినా ఆయన వేదిక మీదకు రాలేదు. 'భయపడినట్టున్నాడు.తరువాత మీరు పిలిచి మాట్లాడండి ' అని జిల్లా కలెక్టర్ రావంత్ గారిని ఆదేశించారు సి.ఎం .

ఇదంతా వింటున్న మాధవయ్య...' మా నాయిన మీటింగుకు రాలెదు సా...' అని చెప్పాడు.
' అవునా..! ఊర్లోలేడా? ఎక్కడికెళ్ళాడు? ఇక్కడ ఇంతపెద్ద మీటింగు జరుగుతావుంటే..." నవ్వుతూ అడిగారు చంద్రబాబు.

' ఇంకో పెళ్ళాం కాడికి పోయినాడు సా..' నిజం చెప్పేశాడు కొన్ని వేలమంది జనం ముందు.


విన్నవెంటనే గతుక్కుమన్నా అందరితోపాటే గట్టిగా నవ్వేశారు మన చంద్రబాబు నాయుడు గారు. 'పిల్లవాడ్ని చదివించడం కంటే ఆయనకు ఇది ఇంపార్టెంటు..పనిచేసి పిల్లోడు సంపాదిస్తే వాళ్ళ నాయిన ఇంకో రెండు ఫ్యామిలీలు పెడ్తాడు. ఈ పిల్లోడ్ని రెసిడెన్షియల్ స్కూల్ లో చేర్పించండి....వెంటనే' సభను ముగించేశారు.

మరుసటిరోజు అన్ని పత్రికల్లోనూ మాధవయ్యే హీరో...
కానీ మనమెప్పుడు మారుదాం???


6 comments:

Kathi Mahesh Kumar said...

మనకిప్పట్లో మారే ఛాన్స్ గానీ ఉద్దేశంగానీ ఉన్నట్లుగా నాకైతే అనిపించడం లేదు.

MURALI said...

ur posts r gud.

Bolloju Baba said...

good narration.

bollojubaba

చైతన్య.ఎస్ said...

అన్ని టపాలు ఇప్పుడే చదువుతున్నాను. బాగున్నాయి. మన చిత్తూర్ యాస విరగదీసారు.

రానారె said...

:-))))
ప్చ్...!

Prasad Papudesi said...

endi maredi. itla vaadu veedu rendo pellam daggariki poyinappudantha maaralante ayithindaa. nuvvu chebthavule....